News

నోట్లు రద్దు పెద్ద కుంభకోణం


దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెట్టడంపై కేజ్రీవాల్‌ శనివారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు పేరుతో పెద్ద స్కాం నడుస్తోందని ఆరోపించారు. మోదీ నోట్ల రద్దు ప్రకటించడానికి ముందే భాజపాతో పాటు ఆ పార్టీ సన్నిహితులకు దీని గురించి తెలుసని.. వారంతా ముందుగానే జాగ్రత్తపడి డబ్బును మార్చేసుకున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే పంజాబ్‌కు చెందిన ఓ భాజపా నేత ట్విట్టర్‌లో రూ.2000 నోట్ల కట్టను పోస్ట్‌ చేశారని కేజ్రీవాల్‌ అన్నారు. మోదీ ప్రకటించిన ఈ విధానం వల్ల నల్లధనం నియంత్రించడమేమీ కుదరదని, కేవలం డబ్బు చేతులు మారుతుందని అన్నారు. గత మూడు నెలల్లో బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు వచ్చాయని, దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రూ.500, రూ.1000 రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేల నోట్లు ప్రవేశపెట్టడంతో డబ్బు మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. డబ్బు కొరత ఏర్పడుతుందని, ప్రజలు ఇబ్బందులకు గురవుతారని తెలిసి కూడా ప్రభుత్వం ఈ విధంగా చేయడాన్ని ఆయన విమర్శించారు. కొత్తగా రూ.2వేల నోటు ప్రవేశపెట్టడంపై కూడా పలు ఆరోపణలు చేశారు.